భర్త వేధింపులు భరించాలన్న జడ్జిపై ఆన్లైన్ ఉద్యమం
భర్త చేతిలో చిత్రహింసలు పడలేక ఓ గృహిణి కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి భక్తవత్సలం సంసారాన్ని, పిల్లలను దృష్టిలో పెట్టుకొని భర్తతో సర్దుకు పోవాలని, అతని వేధింపులు భరించాలని సలహా ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలతో పాటు మహిళా న్యాయమూర్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ న్యాయమూర్తిని వెంటనే తొలగించాలంటూ ఆన్ లైన్ ఉద్యమాన్ని లేవదీశారు. స్త్రీలు, పిల్లలకు సంబంధించి గృహ హింస కేసుల విచారణ విషయంలో న్యాయమూర్తులకు కొన్ని మార్గదర్శకాలు సూచించాలని కోరుతూ పలువురు మహిళా న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ను కలిసి మెమోరాండం సమర్పించారు.
నీ భర్త మంచి బిజినెస్ చేస్తున్నాడని, అతను ఫ్యామిలీ సౌకర్యాలు చూసుకుంటాడని అలాంటప్పుడు అతని వేధింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావని విడాకులు కోరిన ఓ భార్యను జడ్జి భక్తవత్సలం ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ 500 మందికి పైగా మహిళలు వెంటనే ఆన్ లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.