విజయమ్మ, సోనియాకు మధ్య కెవిపి, విలీనమే: రేవంత్
సిబిఐ బదలీల వ్యవహారమే అందుకు నిదర్శనమన్నారు. జగన్ విడుదల కోసమే ఆస్తులు పరిశీలిస్తున్న ఖాన్, జైలు అధికారులు తదితరులు మారారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఫోటోలు, గాంధీ భవనంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉండటం రానున్న రోజుల్లో కామన్ అన్నారు. కాంగ్రెసుతో ఎలాంటి లోపాయకారి ఒప్పందం లేకుంటే విజయమ్మ తన భర్త వైయస్ హెలికాప్టర్ ప్రమాదం పైన అనుమానాలు ఉన్నాయని ఎందుకు దీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.
వైయస్ పాదయాత్రకు సంబంధించి పుస్తకాన్ని ఆవిష్కరించాలనుకోవడం జగన్తో కాంగ్రెసుకు ఉన్న బంధాన్ని తెలియజేస్తుందన్నారు. త్వరలో జగన్ పార్టీ కాంగ్రెసులో కలవడం ఖాయమన్నారు. జగన్ కోసం వైయస్ చేసిన అవినీతి వల్ల కాంగ్రెసు ఇబ్బంది పడుతుందని కాంగ్రెసు పార్టీ నేత వి హనుమంత రావు వ్యాఖ్యానించారని, అలాంటి వైయస్ పైన పుస్తకం తెస్తున్న కెవిపిని అధిష్టానం ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
వైయస్ పుస్తకావిష్కరణ కాంగ్రెసు, జగన్ రహస్య ఒప్పందంలో భాగమే అన్నారు. వైయస్ బతికి ఉన్నప్పుడే కెవిపి ఆ పుస్తకాన్ని ఎందుకు రాయలేదన్నారు. తమ పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కెవిపి జగన్ పార్టీకి కోవర్టు అని మరో నేత వర్ల రామయ్య అన్నారు. అవినీతిపరుడు వైయస్ పాదయాత్రపై పుస్తకం తేవడం సిగ్గు చేటు అన్నారు. దమ్ముంటే వైయస్ అవినీతిపై ఓ పుస్తకాన్ని తీసుకు రావాలని సూచించారు. కేసుల మాఫీ కోసమే కెవిపి కాంగ్రెసులో ఉన్నారని, ఆ తర్వాత జగన్ పంచన చేరడం ఖాయమన్నారు. తెలంగాణపై పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నాయని, వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.