ఆ పనిలోనే: తెలంగాణపై పిఎం, పది రోజుల్లోనే: కెసిఆర్
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ శుక్రవారం మన్మోహన్ను కలిశారు. "తెలంగాణపై శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. సమైక్యాంధ్ర కావాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే అంటున్నారు'' అని వారు విన్నవించారు. అంతా విన్న ప్రధాని 'ఇప్పుడు ఆ సమస్యను తేల్చే పనిలోనే ఉన్నాం' అని బదులిచ్చారు.
ఇదిలా వుంటే, మరో వారం, పది రోజుల్లో తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మధ్యవర్తుల ద్వారా తనను సంప్రదిస్తుందని చెప్పారు. చర్చలకు అందుబాటులో ఉండేందుకే ఢిల్లీ వచ్చానని, మరో పదిరోజులు ఢిల్లీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభిస్తే తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పార్లమెంటు సెంట్రల్ హాలుకు వచ్చిన వచ్చిన రాష్ట్ర మంత్రి మాణిక్య వరప్రసాద్కు ఈ సూచన చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని మాణిక్య వరప్రసాద్ అన్నప్పుడు... 'మీరు కూడా జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించండి' అని సలహా ఇచ్చారు.
"తెలంగాణ కావాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, సమైక్యాంధ్ర కొనసాగించాలని సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేయడంలేదు కదా?'' అని వాయలార్ రవి తనను కలిసిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను ప్రశ్నించారు. దీనిపై ఎంపీలు స్పందిస్తూ - "శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తెలంగాణ రాదన్న నమ్మకం ఏర్పడినందువల్లనే వారు ఉద్యమాలు చేయడం లేదు. తెలంగాణ ఇస్తామని ప్రకటిస్తే సీమాంధ్రలో కూడా ఉద్యమాలు జరుగుతాయి'' అని చెప్పారు.
సీమాంధ్రలో జగన్ మూలంగా పార్టీకి నష్టం జరుగుతుందని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్కు రాజకీయంగా ప్రయోజనం చేకూరవచ్చని వాయలార్ అన్నారు. ఈ వాదనలను సీమాంధ్ర ఎంపీలు ఖండించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లోనూ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలు చల్లారిపోతాయని, గతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు వచ్చి పరిస్థితి మామూలైపోయిందని చెప్పారు.
వయలార్ను కలిసిన వారిలో పార్లమెంటు సభ్యులు కావూరి, కెవిపి రామచంద్రరావు, బాపిరాజు, వెంకట్రామిరెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, సాయిప్రతాప్, కృపారాణి, రాయపాటి, ఉండవల్లి, శీలం, సీనియర్ నేత కణితేటి సత్యనారాయణరాజు ఉన్నారు. సీమాంధ్ర నేతలు ఆజాద్ను కూడా కలిసి ఇవే వాదనలను వినిపించారు.