ప్రధానికాగల అర్హత సుష్మాస్వరాజ్కే: బాల్థాకరే కితాబు
బిజెపిలో అత్యంత జనాకర్షణ ఉన్న నేత సుష్మా స్వరాజ్ మాత్రమేనని, ఆమె చతురతతో మాట్లాడుతుందని అన్నారు. బిజెపిలో ప్రధాని అయ్యే అర్హత కేవలం ఆమెకే ఉన్నాయని చెప్పారు. సుష్మానే ప్రధాని పదవికి అర్హురాలని, తెలివిగల నేత అని, ఆమె మంచి పర్ఫార్మెన్స్ను చూపిస్తుందని తాను అనేకసార్లు చెప్పినట్లు థాకరే పేర్కొన్నారు. కోల్ గేటు వ్యవహారంలో సుష్మా మాట్లాడిన తీరును ఈ సందర్భంగా థాకరే ప్రశంసించారు.
కాగా అంతకుముందు కూడా బాల్ థాకరే... తనకు సైన్యాన్నిస్తే, దేశం బెండు తీసేస్తానంటూ సవాల్ విసిరారు. 86 ఏళ్ల వయసులోనూ దేశ సమస్యల నుంచి పాక్ క్రికెటర్ల రాక దాకా పార్టీ అధికార పత్రిక సామ్నాలో పదునైన వ్యాఖ్యలతో ఠాక్రే స్పందించారు. "సైన్యాన్ని అప్పగించి చూడండి. నెల రోజుల్లోనే అన్ని సమస్యలూ కొలిక్కి తెస్తాను. గాడితప్పిన దేశాన్ని దారికి తెసా ్తను'' అని వెల్లడించారు. అలాగే.. దాయాది దేశ క్రికెటర్లను దేశంలో అడుగు పెట్టనియ్యబోమని హెచ్చరించారు.
ముంబైకు పాక్కు చెందిన టీవీ కళాకారుల రాకపై ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేవ అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బాల్ ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "పాక్ క్రికెటర్లను భారత్లో ఆడనివ్వను. ఇది ఒట్టి హెచ్చరిక కాదు. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రకటనను కూడా వెనక్కి తీసుకోలేదు. ఇకపైనా అంతే వ్యవహరిస్తా'' అని తేల్చి చెప్పారు. అసోంలో ముస్లింలపై దాడులకు వ్యతిరేకంగా గతనెల 11న ముంబైలోని ఆజాద్ మైదాన్లో హింసాత్మకంగా ముగిసిన నిరసన ప్రదర్శనను ఆయన తప్పుబట్టారు.
ఆజాద్ మైదాన్ ఘటనే కాదు, గోధ్రా రైలు దుర్ఘటన కూడా పక్కా ప్రణాళికతో జరిపిన హింసాకాండేనని అభిప్రాయపడ్డారు. దేశంలో సమస్యలు సృష్టించే ముస్లిం ఛాందసవాదులను సహించేది లేదని హెచ్చరించారు. " పాక్, బంగ్లాదేశ్లకు చెందిన కరుడుగట్టిన ముస్లిం మతతత్వవాదుల్లో ఒక్కరిని కూడా అనుమతించేది లేదు. ముంబై నుంచి జమ్మూకాశ్మీర్ దాకా మా పార్టీ శాఖలు ఉన్న ప్రతి చోటా అడ్డుకొని తీరుతాం'' అని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయాలపై స్పందిస్తూ.." 2014 కన్నా ముందే ఎన్నికలు జరుగుతాయనేది నా అంచనా. దేశంలో అరాచక పాలన సాగుతోందని ఎప్పుడో నేను చెప్పాను. ఇప్పుడది మరింత పతనావస్థకు చేరుకుంది'' అని వివరించారు. ముంబైలో నేర కార్యకలాపాలకు కారణమైన బీహార్కు చెందిన వ్యక్తులను పోలీసులు వేటాడటాన్ని బాల్ఠాక్రే సమర్థించారు. బీహార్ సిఎం నితీశ్ అభ్యంతరాలపై తీవ్రంగా స్పందించారు. "చట్టాలు చేసేది ప్రజల కోసమా? ఉగ్రవాదుల కోసమా? అని ప్రశ్నించారు.