నానిని టార్గెట్ చేసిన బాలయ్య: కృష్ణా జిల్లాలో మకాం
అందుకే ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పార్టీలోని ఆయా జిల్లాల నేతలతో భేటీ అవుతూ, ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తూనే ఇంకో వైపు గుడివాడపై ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావును తిరిగి పార్టీలోకి రప్పించడంలో బాలకృష్ణనే కీలక పాత్ర వహించారు. 2014లో పార్టీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆయనను పార్టీలోకి రప్పించారు.
సోమవారం రావిని తన ఇంటికి రప్పించుకొని స్వయంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్దకు తోడ్కొని పోయారు. బాబుతో మాట్లాడి గుడివాడ టిక్కెట్ పైన బాబుతో కూడా హామీ ఇప్పించారని సమాచారం. అ తర్వాత అధికారికంగా బాబు సమక్షంలో రావి టిడిపిలో చేరారు. బాబు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిస్థితుల కారణంగా రావికి 2004, 2009లో టిక్కెట్ ఇవ్వలేదని వచ్చేసారి తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. రావిని రప్పించడం, బాబుతో ప్రకటన చేయించడం ఇలా బాధ్యత అంతా బాలయ్యనే తీసుకున్ననట్లుగా కనిపిస్తోంది.
గుడివాడపై ప్రత్యేక దృష్టి నేపథ్యంలో బాలయ్య త్వరలో ఆ నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరిన రావి వెంకటేశ్వర రావు త్వరలో గుడివాడ టిడిపి ఇంచార్జిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ బాధ్యతల స్వీకారోత్సవానికి బాలకృష్ణ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. అదే సమయంలో బాలకృష్ణ రెండు రోజుల పాటు ఆయన కృష్ణా జిల్లాలో మకాం వేసి పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారని తెలుస్తోంది.