తెలంగాణ చిచ్చు: త్వరలో టిడిపికి బైరెడ్డి గుడ్బై
తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి లేఖ ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాయలసీమకు చెందిన పార్టీ నాయకులను ఒప్పించేందుకు ఆయన చర్చలు ప్రారంభించారు. అయితే చంద్రబాబు నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడం, ఆయన అభిప్రాయాన్ని తీసుకోకపోవడంతో బైరెడ్డి అలక వహించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఏ క్షణాన్నైనా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం తెలంగాణకు సంబంధించి లేఖ ఇవ్వదలిస్తే అందులో ప్రత్యేక రాయలసీమ విషయాన్ని ప్రస్తావించాలని బైరెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలా కాని పక్షంలో పార్టీని వీడేందుకు వెనుకాడబోనని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ ఇస్తే సీమలో పతనం ఖాయమన్న భావనతో బైరెడ్డి రాజకీయంగా సొంత బలం పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తొలుత కర్నూలు జిల్లాకు చెందిన పలువురు టిడిపి నాయకులతో సంప్రదింపులు జరిపి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఇప్పటికే అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. పలువురు టిడిపి నాయకులు బైరెడ్డికి మద్దతునిచ్చేందుకు ముందుకువచ్చినట్లు సమాచారం. కాగా అక్టోబర్ 2వ తేదీ నుంచి బైరెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. కర్నూలు జిల్లాలోని ప్రాచీన గ్రామమైన ఓర్వకల్లు మండలం కేతవరం నుంచి ప్రారంభించే పాదయాత్ర 40 రోజుల పాటు కొనసాగనుంది. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించి అనంతపురం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.