ఇందిరమ్మ బాట కాదు...: సిఎంకు చంద్రబాబు సలహా
రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఒకవైపు నీరు, విద్యుత్ లేక పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఉండగా మరోవైపు కరెంటు కోతలతో పరిశ్రమలు మూలపడే పరిస్థితి ఉందని, ఈ సమస్యలన్నీ వదిలేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పట్టారని ఆయన అన్నారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్కోతకు నిరసనగా పారిశ్రామిక వేత్తల సంఘం శనివారం ఇందిర పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. వారికి తెలుగుదేశం మద్దతు తెలుపుతూ చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట వదిలేసి ఒక్కసారి జీడిమెట్ల పారిశ్రామిక వాడకు వస్తే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. రైతులలానే పరిశ్రమల పరిస్థితి ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా ఈ ప్రభుత్వం పోతోందని ఆయన ఎద్దేవా చేశారు.
తొమ్మిదేళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా 24 గంటలు కరెంట్ సరఫరా చేసిందని, రైతులకు 9 గంటలపాటు విద్యుత్ ఇచ్చామని, ఒకవేళ అరగంటో, గంటో కరెంట్ పోతే అదనంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనత టిడిపీదేనని చంద్రబాబు అన్నారు. ఏది ఏమైనా పారిశ్రామిక వేత్తలకు టీడీపీ అండగా ఉంటుందని, కరెంట్ కోత ఎత్తివేసేవరకు వారితో కలిసి పోరాటం చేస్తామని చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చారు.