సిఎంకు సహకరిస్తే..: టి-మంత్రులకు హరీష్ హెచ్చరిక
సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్లో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. తెలంగాణవాదులను కవ్వించేందుకే ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. విగ్రహాలు పెట్టి చూస్తే అవి ఉంటాయో ఊడుతాయో తెలుస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అతను తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
అంతకుముందు పెట్రో ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలు ఉండవద్దని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనమండలి ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి వారిని పిలిపించి మాట్లాడినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కు తరలించారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం పోలీసు వాహనంలోనే తమ నిరసన తెలియజేశారు.
రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చే వరకు తాము వాహనంలోనే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు తాము పోలీసు వాహనంలోనే వెళ్తామని చెప్పారు. విద్యుత్ కొరత కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.