కోదండరామ్పై షిండేకు లగడపాటి ఫిర్యాదు
శ్రీధరబాబును కోదండరామ్ బెదిరించారని, ఈ బెదిరింపులు రాజ్యాంగ వ్యతిరేకమని లగడపాటి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వ్యక్తం చేసిన అనుమానాలు నిజమవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు, మావోయిస్టుల విధ్వంసం పెరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వలేమని వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు చేయాలని, ఉద్యమ నేతలను అణచేయాలని ఆయన షిండేను కోరారు.
తండ్రికి పట్టిన గతే మంత్రి శ్రీధర్ బాబుకు పడుతుందని కోదండరామ్ కరీంనగర్లో అన్నట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని ఆయన అన్నారు. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేశారు. దీంతో కోదండరామ్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. కోదండరామ్ వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా మండిపడ్డారు. దీనిపై లగడపాటి షిండేకు ఫిర్యాదు చేశారు.
తన వ్యాఖ్యలపై కోదండరామ్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. తాను అన్న మాటలకు ముందు వెనకలు తీసేయడం వల్ల వేరే అర్థం వచ్చిందని, తమకు హింసపై నమ్మకం లేదని ఆయన అన్నారు. తాము గాంధేయ పద్ధతిలోనే ఉద్యమాన్ని నడిపిస్తామని ఆయన చెప్పారు.