ర్యాలీ: ఢిల్లీలో చంద్రబాబు, ములాయం అరెస్టు
పెంచిన డీజిల్ ధరలను తగ్గించే వరకు ఆందోళన ఆగదని అంతకు ముందు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలు చేపట్టిన బంద్లో భాగంగా ములాయం సింగ్ యాదవ్ చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు ఢిల్లీలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేసిన బిజెపి జాతీయ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు, షానవాజ్, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. యుపిఎ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారత్ బంద్ వల్ల రోడ్డు, రైలు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబైలో బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది.
కర్ణాటక రాష్ట్రంలో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. పాలు, వైద్యం వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. రైలు ప్రయాణికులు స్టేషన్లలో నిలిచిపోవాల్సి వచ్చింది. బస్సులు నడవలేదు. పాలక పక్షం సమాజ్వాదీ పార్టీ ప్రభావంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బంద్ తీవ్రత కొట్టొచ్చినట్లు కనిపించింది. పలు స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా చూస్తే బంద్ ప్రభావం మిశ్రమంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ ప్రభావం కాస్తా తీవ్రంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నాయకులు అరెస్టయ్యారు.