సంక్షోభం తీవ్రం: మమతా బాటలో ములాయం?
అయితే, తాజాగా ఎస్పీ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. యుపిఎ ప్రభుత్వానికి దూరం జరిగి, తృతీయ కూటమికి పునాదులు వేసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది. యుపిఎకు ఇప్పటి వరకు ఎస్పీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది. ఎస్పీకి 22 మంది లోకసభ సభ్యులున్నారు. వీరి మద్దతు యుపిఎకు కీలకం. మమతా బెనర్జీ స్థానంలో బిఎస్పీ అధినేత మాయావతిని ప్రభుత్వంలో చేర్చుకునేందుకు కాంగ్రెసు పెద్దలు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు మాయావతి మాత్రమే యుపిఎకు పెద్ద దిక్కుగా మారినట్లు అర్థం చేసుకోవచ్చు.
కాగా, మద్దతు ఉపసంహరించుకునే విషయంపై మమతా బెనర్జీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎస్పీ, తెలుగుదేశం, వామపక్షాలు గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యుపిఎ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తాయి. ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి ములాయం సింగ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఈ ర్యాలీలో ములాయం సింగ్, వామపక్షాల నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, ఎబి బర్దన్లతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.
ములాయం సింగ్ యాదవ్తో కలిసి పనిచేయడానికి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే సుముఖంగా ఉన్నారు. తాజాగా మమతా బెనర్జీని కూడా కూటమిలో చేర్చుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కోల్కత్తాలో జరిగిన ఎస్పీ సమావేశంలో ములాయం సింగ్ యాదవ్ మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. మమతా బెనర్జీతో కూడా భేటీ అయ్యారు. ఈ స్థితిలో ములాయం సింగ్ యాదవ్ ప్రధాని పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తూ అందులో భాగంగా మూడో కూటమిని ముందుకు తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.