సోనియా సహా ఢిల్లీ పెద్దలతో నరసింహన్: తెలంగాణపైనే?
ఆ తర్వాత గవర్నర్ ప్రధాని మన్మోహన్సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలతో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతితో దాదాపు 20 నిమిషాల పాటు నరసింహన్ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ను కలుసుకున్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్తో నరసింహన్ భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరాలతో కూడా గవర్నర్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రానున్న నేపథ్యంలో గవర్నర్ భేటీలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు చెబుతున్నారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారిక కార్యక్రమాలపై సీఎం ఢిల్లీ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వివరించాయి. తెలంగాణ సహా, రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఏఐసీసీ అగ్రనాయకత్వం ఇటీవల లోతుగా చర్చలు సాగించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తాను ప్రధానిని కలుసుకోలేదని, ఉప రాష్ట్రపతిని కలవడానికి మాత్రమే ఢిల్లీ వచ్చానని ఆజాద్తో భేటీ అనంతరం నరసింహన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ మార్చ్ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన చెప్పారు. మార్చ్ను అడ్డుకోవద్దని తెలంగాణ జెఎసి నేతలు తనను కోరారని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, జీవవైవిధ్య సదస్సు నేపథ్యంలో తెలంగాణ మార్చ్ను వాయిదా వేసుకునే విధంగా తెలంగాణ జెఎసిని బుజ్జగించాలని సోనియా గవర్నర్కు సూచించినట్లు సమాచారం. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో స్పందన ఎలా వుంటుందనే విషయాన్ని కూడా ఆమె ఆయననుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీలోనే మకాం వేశారు. మీడియా వార్తలు ఎలా ఉన్నా, ఆయన కాంగ్రెసు పెద్దలతో సీరియస్గానే చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో కాంగ్రెసులో తెరాస విలీనం అనే అంశం కూడా చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఈ నెల 30వ తేదీలోగానే కేంద్రం ఏదైనా ప్రకటన చేస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ జెఎసి తెలంగాణ మార్చ్ను చేపట్టారు.
తెలంగాణ మార్చ్ వేడి క్రమంగా నాయకులందరికీ తాకుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం హైదరాబాదులో తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. వారితో తెలంగాణ మార్చ్పై చర్చించినట్లు సమాచారం. రేపు శుక్రవారం అన్ని పార్టీల నేతలతోనూ తెలంగాణ మార్చ్పై ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. దానిపై కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.