రెండు రోజుల్లో తేలుస్తా: తెలంగాణపై చంద్రబాబు
కాగా, తెలంగాణపై స్పష్టత ఇస్తానంటూ చంద్రబాబు చాలా రోజులుగా చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటివారంలోనే తెలంగాణపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే, సీమాంధ్ర నాయకుల నుంచి కొంత మేరకు వ్యతిరేకత ఎదురు కావడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి.
పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం టి-టిడిపి నేతలు పలువురు వేరుగా సమావేశమయ్యారు. సమావేశంలో చంద్రబాబు కేంద్రానికి రాయాల్సిన లేఖ పైన, తెలంగాణ పైన మాట్లాడక పోవడంతో ఆయన ఈ విషయంపై దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయానికి టిటిడిపి నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు ప్రత్యేకంగా సమావేశమై బాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెల 30వ తేదిలోగా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని, ఆ తర్వాత ఇచ్చినా లాభం ఉండదని బాబుకు చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వారం రోజుల్లోనే తెలంగాణపై బహిరంగ ప్రకటన, కేంద్రానికి టిడిపి తరఫున లేఖ పంపించే విషయాలపై చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఒప్పించాలని వారు నిర్ణయించుకున్నారు. అప్పటికీ బాబు స్పందించని పక్షంలో, ఒకవేళ స్పందించినా ఎలా స్పందిస్తారో చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు.