సమైక్యాంధ్రపై జెసి వైఖరిలో మార్పు: ఢిల్లీకి దూరం
రాష్ట్ర సమైక్యతపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నెలాఖరున గానీ, వచ్చే నెలారంభంలో గానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టున్న చెబుతున్నారు. సీమాంధ్రకు చెందిన మంత్రి శైలజానాథ్ ఇప్పటికే ఢిల్లీ చేరారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
శనివారం జరిగిన ఈ సమావేశానికి ఆరుగురు మంత్రులు హాజరుకాగా, 24 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆది నుంచి రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్న రాయలసీమ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితో పాటు మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.
అప్పటి హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన వెంటనే సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామా సమర్పించిన మొదటి శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి. అటువంటిది ఇప్పుడు ఆయన సమైక్యాంధ్రపై కాస్తా పట్టు సడలిస్తున్నట్లు చెబుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను కూడా ఆ మధ్య ఆయనే ముందుకు తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అది తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ప్రతిపాదనను అటు రాయలసీమ నాయకులు గానీ ఇటు తెలంగాణ నాయకులు గానీ అంగీకరించలేదు.