తెలంగాణపై తేల్చుకుంటం, రాక్షసులమా: కోదండరామ్
తెలంగాణ మార్చ్కు పోలీసుల అనుమతి అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని, బందోబస్తు ఏర్పాటు చేయడానికి మాత్రమే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయంపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులకు, శానససభ్యులకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని, ఈలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయించాలని, లేదంటే తమతో పాటు తెలంగాణ మార్చ్లో ఉండాలని ఆయన అన్నారు.
తెలంగాణ తేవాల్సిన బాధ్యత మంత్రులది, శాసనసభ్యులదని, వాళ్లు పూనుకుంటే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తమ గడువును, డిమాండ్ను తెలంగాణ మంత్రుల ముందు కూడా పెడతామని ఆయన చెప్పారు. మంత్రులు ముందు ఉంటే, తాము హర్డిల్స్ దాటి మార్చ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు. మంత్రులకు ఇదే చివరి అవకాశమని, తమతో వస్తారా, తెలంగాణ తెస్తారా తేల్చుకోవాలని ఆయన అన్నారు. తమపై పెత్తనం చెలాయిస్తూ సీమాంధ్ర పాలకులతో నడుస్తుందా, తమ ప్రజాస్వామ్య ఆకాంక్షకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తేల్చుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణలో ప్రకృతి సంపద నాశనమైపోతున్న తీరును జీవవైవిధ్య సదస్సు సందర్భంగా ప్రపంచానికి తెలియజేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్ను శాంతియుతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇంటికో మనిషి తెలంగాణ మార్చ్కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్కు సాగరహారం అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కవాతులో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ఆయన చెప్పారు. మంత్రులు జనంతో ఉంటారో, ఆంధ్ర పాలకుల ప్రభుత్వంతో ఉంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవాలని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే బ్రాండ్ ఇమేజ్ ఉండాలని ఆయన అన్నారు.