మార్చ్ విహార యాత్రకోసంకాదు, కవ్వించినా: కోదండరాం

Kodandaram
హైదరాబాద్/నల్గొండ: ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడినా తెలంగాణ కవాతు ఆగదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం అన్నారు. హైదరాబాదులోని అడ్డగుట్టలో తెలంగాణ జాతర పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమ నేతలను నిర్బంధించినా లక్షలాది బలగాలను మోహరించినా కవాతు జరుగుతుందన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చాటి చెప్పాలనుకుంటున్నామన్నారు. రాజకీయాలకతీతంగా అందరు ప్రజాప్రతినిధులు ఏకతాటి పైకి రావాలన్నారు.

ఈ నెల 30న హైదరాబాద్‌లో జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ మార్చ్ విహార యాత్ర కోసం కాదని కోదండరాం నల్గొండ జిల్లా భువనగిరిలో అన్నారు. ఆదివారం తెలంగాణ యుటిఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన తెలంగాణ మార్చ్ సన్నాహక సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. శాంతియుతంగా తమ ఆకాంక్షను తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న తెలంగాణ మార్చ్‌తో ఏదో జరుగుతుందని అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఎలాంటి అనుమతులు అవసరంలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ మార్చ్‌ను నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. ఇంటికో మనిషి, చేతిలో జెండా, సంకలో సంచి, అందులో జొన్నరొట్టెలు పెట్టుకొని తెలంగాణవాదులు లక్షలాదిగా తెలంగాణ మార్చ్‌కు హాజరై తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా జరిగే తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవాలని చూస్తే అనంతరం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ మార్చ్ నిర్వహణ కోసం త్వరలో హోంమంత్రిని కలసి లిఖితపూర్వకంగా అనుమతి కోరతామని ఆయన పేర్కొన్నారు. సమైక్య వాదంతో ముందుకు సాగుతున్న సిపిఎం పార్టీ నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ తెలంగాణ యుటిఎఫ్ బయటికి రావడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికైనా సమైక్యవాద పార్టీలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తమ మద్దతును తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి వెంటనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన యుపిఎ ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా మార్చ్‌ను నిర్వహించి తెలంగాణ ఆకాంక్షను జీవ వైవిధ్య సదస్సుకు హాజరవుతున్న 196 దేశాల ప్రతినిధులకు తెలియజేస్తామని ఆయన అన్నారు. మార్చ్‌కు ముందు తెలంగాణవాదులను, విద్యార్థులను, ఉద్యోగులను అరెస్టు చేయడం, నిర్బంధించడం లాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కోసం అనుకూలంగా ప్రకటన వచ్చే సమయంలో మాత్రమే సీమాంధ్ర నాయకులు కృత్రిమ ఉద్యమాలు ప్రారంభించడం సిగ్గుచేటన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+