తెలంగాణపై తేల్చిన చంద్రబాబు, ప్రధానికి లేఖ
తాము 2008 అక్టోబర్లో తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను తాము వెనక్కి తీసుకోలేదని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, వెంటనే అనిశ్చితికి తెర దించాలని ఆయన ప్రధానిని కోరారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిందని ఆయన అన్నారు.
తెలంగాణ అంశంపై 2004లో కాంగ్రెసు హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని గెలిచిందని, ప్రజలను కాంగ్రెసు మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ స్వార్ధం కోసం వాడుకుంటోందని, కాంగ్రెసు రాజకీయం కోసం వాడుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం జఠిలం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. తమ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు పార్టీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. 2008లో లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారే తప్ప ఆ లేఖకు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పలేదు.
చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖను గొప్ప ముందడుగుగా తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు అన్నారు. కాంగ్రెసు, తెరాస తమ పార్టీని దెబ్బ తీయడానికి తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నాయని, ఆ పార్టీల నాయకుల నాటకాలు దీంతో బయటపడుతాయని వారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు లేఖను ఆహ్వానించారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు మంగళ, బుధవారాలు తెలంగాణ, సీమాంధ్ర నాయకుల ఉమ్మడి సమావేశంలో చర్చించారు. చివరకు బుధవారం రాత్రి చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.
తెలంగాణపై తీర్మానం పెట్టాలని గానీ, తాము తెలంగాణకు అనుకూలమని గానీ చంద్రబాబు ప్రధానికి లేఖలో చెప్పలేదు. తాము 2008లో ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖను మాత్రమే ప్రస్తావించారు. అయితే, తెలంగాణవాద పార్టీలు మాత్రం చంద్రబాబు లేఖలోని అంశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాదయాత్ర కోసం మాత్రమే చంద్రబాబు ఆ లేఖ రాశారని వారంటున్నారు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెడితే తాము ఓటేస్తామని చెప్పలేదని, తాము తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరలేదని వారంటున్నారు.