తెలంగాణపై సిఎం: సెక్రటేరియెట్లోకి చొచ్చుకెళ్లిన జాగృతి
నిమజ్జనంపై మార్చ్ ఎఫెక్ట్
కాగా గణేష్ నిమజ్జనంపై తెలంగాణ మార్చ్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణవాదులు తెలంగాణ మార్చ్ తలపెట్టిన నేపథ్యంలో వినాయక నిమజ్జనాన్ని త్వరగా ముగించాలని నిర్వాహకులను తాము కోరినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. తెలంగాణ కవాతు కోసం జెఏసి నేతలు తమ అనుమతి కోరలేదన్నారు. జెఏసి చైర్మన్ కోదండరామ్, ఇతర నేతలతో కలిసి కవాతు సమాచారం మాత్రమే ఇచ్చారని తెలిపారు.
చివరి రోజు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు వినాయకుల నిమజ్జనం జరిగే అవకాశముందన్నారు. ఇందుకోసం 19 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిమజ్జనం దృష్ట్యా ట్యాంక్బండ్ వద్ద కవాతుకు అనుమతి ఇవ్వలేమన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే తమ లక్ష్యమన్నారు. కవాతు వాయిదా వేసుకోవాలని తాము ఐకాస నేతలను కోరినట్లు చెప్పారు. సిసి కెమెరాలతో నగరంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మార్చ్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశముందని, బయటి నుండి వచ్చే వారు మార్చ్లో పాల్గొనవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న విద్యార్థులు తలపెట్టే మార్చ్కు కూడా అనుమతి లేదని చెప్పారు. నగరంలో 500 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, 15వేల మందితో పోలీసులతో భద్రత చర్యలు చేపట్టామని తెలిపారు. 40 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు.