ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఫర్, కరుణానిధి రిజెక్ట్

కరుణానిధితో చర్చించడానికి మంగళవారం పిఎంఓలో సహాయ మంత్రి వి. నారాయణ స్వామిని పంపించారు. మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన ద్వారా ప్రధాని చెప్పించారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరడానికి తాను పార్టీ ప్రతినిధులు ఎవరినీ ప్రస్తుతం సిఫార్సు చేయబోనని కరుణానిధి నారాయణ స్వామికి చెప్పారు.
కరుణానిధిని నారాయణస్వామి మంగళవారం కలిసి అర గంట పాటు చర్చించి, ప్రధాని ఆఫర్ గురించి వివరించారు. 19 మంది సభ్యులు గల తృణమూల్ కాంగ్రెసు యుపిఎ నుంచి వైదొలిగిన తర్వాత 18 మంది సభ్యుల గల డిఎంకె అత్యంత పెద్ద మిత్రపక్షంగా మారింది.
తమ పార్టీ పార్లమెంటు సభ్యులు మంత్రి పదవులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కరుణానిధి ఆలోచన మరో విధంగా ఉందని డిఎంకె వర్గాలంటున్నాయి. ప్రభుత్వ స్థిరత్వం గురించి కరుణానిధి ఆలోచిస్తున్నట్లున్నారని ఆ వర్గాలన్నాయి. యుపిఎతో కొనసాగడాన్ని జిల్లా కార్యదర్శులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవాలని వారు కోరుతున్నారు.
యుపిఎపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, అయినా యుపిఎ ప్రభుత్వాన్ని బలపరచడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని, అదే సమయంలో కాంగ్రెసుకు దూరంగా ఉంటున్నామని డిఎంకె సీనియర్ నేతలు అంటున్నారు. ఇదే వ్యూహాన్ని అనుసరించేందుకు కరుణానిధి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందుకే మంత్రివర్గంలో చేరడానికి ఆయన విముఖత ప్రదర్శించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications