చంద్రబాబు తెలంగాణ లేఖ: శాపమా, వరమా?
తెలంగాణపై కాంగ్రెసులోని ఇరు ప్రాంతాల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరదని, అందువల్ల కాంగ్రెసు తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకోబోదని, అఖిల పక్ష సమావేశం పెట్టాలని తాము అడిగినా కేంద్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితిలో లేదని ఆయన భావించి, తన పాదయాత్రకు కొంత సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ఆయన ప్రధానికి లేఖ రాశారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కర్ర విరగకుండా పాము చావకుండా చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ కాంగ్రెసు పార్టీలోనో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోనో ప్రకంపనలు సృష్టించలేదు. సొంత పార్టీలోనే చిచ్చు రేగింది. రాయలసీమకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. రాయలసీమకే చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కోస్తాంధ్ర నుంచి మాత్రం ఇప్పటి వరకు లేఖపై పెద్దగా ప్రతిస్పందన రాలేదు. అయితే, ఇద్దరు శాసనసభ్యులు ప్రవీణ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడి ఉన్నారని, తెలంగాణపై చంద్రబాబు లేఖను సాకుగా చూపి బయటకు వెళ్తున్నారని, లేఖ రాయకపోయినా ఎప్పుడో ఒకప్పుడు జారుకునేవారేననే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే తెలుగుదేశం పార్టీకి కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు.
కానీ, సమస్యంతా తెలంగాణ ప్రాంతం నుంచే వస్తోంది. చంద్రబాబు ఇచ్చిన లేఖపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు, తెరాస నాయకులు పెదవి విరవడమే కాదు, చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. పాత వాదననే చంద్రబాబు కొత్తగా వినిపించారని అంటున్నారు. అందువల్ల తెలంగాణలో చంద్రబాబుకు ప్రజల నుంచి కూడా పెద్దగా సానుకూల వైఖరి లభించే అవకాశాలు లేవని అంటున్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు ఎంతగా చెప్పినప్పటికీ తెలంగాణపై చంద్రబాబు రాసిన లేఖను స్పష్టత ఇచ్చినట్లుగా భావించే పరిస్థితి లేదు.
నిజానికి, లేఖ ఇవ్వకపోయినా పరిస్థితి ఇలాగే ఉండేదని, ఇంతకన్నా చెడిపోయి ఉండేది కాదని అంటున్నారు. లేఖ ఇవ్వడం వల్ల సీమాంధ్ర నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని అంటున్నారు. సాకుగా చూపడానికి కొంత మందికి అస్త్రంగా అంది వచ్చిందని కూడా అంటున్నారు. ఏమైనా, తెలంగాణపై ప్రధానికి చంద్రబాబు లేఖ రాసి తప్పు చేశారా అనే సందేహమే ఎక్కువగా వినిపిస్తోంది.