టిడిపికి బైరెడ్డి గుడ్బై: సీమ లెక్కలేదా.. బాబుపై విసుర్లు

ఢిల్లీలో పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటించేలా కనిపిస్తోందని, అప్పుడు రాయలసీమ పరిస్థితి ఏమిటని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన అభిమానంతో టిడిపిలో చేరానని, అప్పటి నుండి పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశానని చెప్పారు. నాడు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాను రాయలసీమ ఆత్మాభిమానం కోసం పోరాడుతానని తొలి నుండి చెబుతున్నానని, బుధవారం తెలంగాణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు తమ పార్టీ అధినేత లేఖ రాయడం తనను కలిచి వేసిందన్నారు. అదే లేఖలో బాబు రాయలసీమ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. సీమ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరని, ఈ ప్రాంతమంటే ఆయనకు లెక్కలేదా అన్నారు. ఈ ప్రాంతం ఉన్నది కేవలం ముఖ్యమంత్రులు కావడానికేనా అని ప్రశ్నించారు.
నాటి సిద్ధాంతాల కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఆధ్వర్యంలో పని చేశానని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు ఓకే చెప్పి సీమను నిర్లక్ష్యం చేయడంతో తాను పార్టీలో ఉండదల్చుకోలేదన్నారు. రాయలసీమ ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం, ఆత్మాభిమానం కోసం తాను పోరాటం చేస్తానని చెప్పారు. కాగా గత కొంతకాలంగా రాయలసీమ కోసం ఉద్యమిస్తున్న బైరెడ్డి తెలంగాణకు పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తాను పార్టీ వీడుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ఇచ్చిన లేఖతో ఒరిగేదేమీ లేదని బైరెడ్డి అన్నారు. లేఖ ఎందుకిచ్చారో అర్థం కావడం లేదన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతిస్తానని తెలిపారు. బాబు తన లేఖలో రాయలసీమ గురించి ప్రస్తావించక పోవడమే తనకు ఆవేదన కలిగించిందని బైరెడ్డి చెప్పారు. సీమ అంటే ఆట బొమ్మ కాదన్నారు. బాబు యాత్రకు అనంతపురంను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తనను చూసే పాదయాత్రను ఎంచుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications