భారత్ నిర్మించిన చాబహార్ పోర్టుపై అమెరికా వైమానిక దాడి: ఇరాన్ ప్రతీకారం!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా సైన్యం ఇరాన్ లోని చాబహార్ ఓడరేవుపై వైమానిక దాడి చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే ఈ చర్య లక్ష్యమని అమెరికా పేర్కొంటోంది. మరోవైపు ఇరాన్ దీనిని ఓ తీవ్రమైన దాడిగా అభివర్ణించింది. తమ మౌలిక సదుపాయాలను మళ్లీ లక్ష్యంగా చేసుకుంటే.. పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టంగా హెచ్చరించింది.
ఇరాన్లోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొన అమెరికా ఆరో రోజు వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులలో ఒమన్ గల్ఫ్లోని చాబహార్ ఓడరేవును కూడా లక్ష్యంగా చేసుకున్నారు. చాబహార్ ఓడరేవులోని ఓ నిఘా టవర్ కూలిపోయింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, టవర్ కూలిపోతున్నట్లు చూపిస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్థిక పరంగా ఇరాన్కు చాబహార్ ఓడరేవు ఓ ముఖ్యమైన ఓడరేవు. ఇది ఆఫ్ఘనిస్తాన్కు ఓ కీలకమైన వాణిజ్య మార్గంగా కూడా పరిగణించబడుతుంది. దీని అభివృద్ధిలో భారత్ కూడా కీలక పాత్ర పోషించింది. ఓడరేవుపై ఇది మూడో దాడి అని ఇరాన్ మీడియా నివేదించింది. అయితే స్థానిక అధికారులు వెంటనే వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో కనీసం 8 మంది మరణించగా.. మరో 20 మంది గాయపడ్డారు.

ఈలోగా ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయని సమాచారం. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూన్ 22 నుంచి కొనసాగుతున్న ఈ ఘర్షణలో 38 మంది మరణించగా, 400 మందికి పైగా గాయపడ్డారు.
ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ దాడులకు ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలు దెబ్బతింటే పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సీనియర్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ఫజల్ షెకర్చి అన్నారు. ఈ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్లకు ఉనికిలో ఉండే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి భద్రత ఇరాన్ నియంత్రణలో ఉందని, ఈ ప్రాంతంలో అస్థిరతకు అమెరికా సైనిక ఉనికియే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంత భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని పేర్కొంటూ, ఇరాన్ ఈ ప్రాంతంలోని ఇతర దేశాల సహకారానికి కూడా విజ్ఞప్తి చేసింది.
ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్
మరోవైపు ఒమన్లోని రెండు అమెరికా రాడార్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ పేర్కొంది. ఇంకోవైపు కువైట్లోని అమెరికా సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది.












Click it and Unblock the Notifications