కాంగ్రెసు అధిష్టానంపై దామోదర ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిమిషానికో మాట చెప్పడం ఎందుకని ఆయన అడిగారు. తెలంగాణ ఎక్కడుందని కేంద్ర మంత్రి వాయలార్ రవి అనడం సబబు కాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి తెలంగాణపై అలా ఎందుకు మాట్లాడారని ఆయన అడిగారు. తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు.
మంత్రులతో తెలంగాణ జెఎసి, రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్చలు జరిపారు. తెలంగాణ మార్చ్కు ట్యాంక్బండ్ను కాకుండా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అందుకు తెలంగాణ జెఎసి నిరాకరించింది. ట్యాంక్బండ్పై కాకపోతే నెక్లెస్ రోడ్డుపై మార్చ్కు అనుమతి ఇవ్వాలని జెఎసి కోరింది. వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సదస్సు ఉన్న నేపథ్యంలో మార్చ్కు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు.
తెలంగాణ ప్రజలు, ఉద్యమ నాయకులు తెలంగాణ ఆకాంక్షను తెలియజేస్తున్నారని, అందులో రెండో అభిప్రాయం లేదని, రాష్ట్ర మంత్రిగా మార్చ్ను వాయిదా వేసుకోవాలని తాను కోరుతున్నానని ఆమె అన్నారు. నిమజ్జనం చాలా సున్నితమైన వ్యవహారమని, ఏదైనా జరగకూడదని జరిగితే ప్రమాదమని ఆమె అన్నారు. మార్చ్ ప్రశాంతంగా జరుగుతుందని చెబుతున్నారని, అయితే తమకు అందాల్సిన సమాచారం తమకు అందిందని ఆమె అన్నారు. తెలంగాణ కవాతు విషయంలో ప్రజల్లో ఆందోళన లేదని ఆమె అన్నారు.
వేదిక మార్చుకోవడానికి తెలంగాణ జెఎసిని ఒప్పించాలని కోరడానికి మంత్రులు జానా రెడ్డి, సారయ్య కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను కలిశారు. అయితే, పార్లమెంటు సభ్యులు అందుకు అంగీకరించలేదు. తెలంగాణ జెఎసి చెప్పిన వేదిక మీదనే తెలంగాణ మార్చ్ జరుగుతుందని వారు చెప్పారు.