తెలంగాణ: బొత్స అనుకూలం, కిరణ్ రెడ్డి వ్యతిరేకం?
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన శనివారంనాడు అన్నారు. సమైక్యాంధ్ర సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాస రావు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగానే విశాఖపట్నంలో బొత్స తన తెలంగాణ అనుకూల వైఖరిని వెల్లడించారు. తాను సమైక్యాంధ్రకు అనుకూలమని ఎప్పుడూ చెప్పలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. బొత్స వైఖరిని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాటలు కూడా స్పష్టం చేశాయి.
బొత్స తెలంగాణకు అనుకూలమని, తన వైఖరిని బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానం వద్ద కూడా స్పష్టం చేశారని పాల్వాయి గోవర్దన్ రెడ్డి శనివారం అన్నారు. ఇటీవల ఢిల్లీలో మకాం వేసినప్పుడు అధిష్టానం పెద్దలతో బొత్స సత్యనారాయణ తన తెలంగాణ అనుకూల వైఖరిని వెల్లడించినట్లు చెబుతున్నారు. దానికితోడు, తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం స్పష్టతకు వచ్చిందని, ఏ క్షణంలోనైనా ప్రకటన చేయవచ్చునని ఆయన అన్నారు.
బొత్స సత్యనారాయణ శనివారం వెల్లడించిన విషయాలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఒక రకంగా పార్టీ అధిష్టానం తెలంగాణ అనుకూల వైఖరిని ప్రకటించబోతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలోనే తెలంగాణకు పూర్తి మద్దతు లేదని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యపై పొన్నం ప్రభాకర్ వంటి తెలంగాణ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
బొత్స సత్యనారాయణ మరో మాట కూడా అన్నారు. 2014 వరకు ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ లేదని చెప్పారు. అంటే, రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ చెప్పినట్లుగా 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ అనుకూల వైఖరిని వెల్లడించడానికి సిద్ధమవుతుందా అని అనిపిస్తోంది. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమని కూడా టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణ అనుకూల వైఖరిని ఎప్పుడు, ఎలా ప్రకటించాలనే విషయంపైనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.