తెలంగాణకు బొత్స బాసట, బాబు క్లారిటిపై విసుర్లు
రాష్ట్రంలోని సమైక్యవాదం, ప్రత్యేక తెలంగాణ డిమాండ్ నేపథ్యంలో యుపిఎ శాశ్వత పరిష్కారం కనుక్కుంటుందని ఆయన అన్నారు. శనివారంనాడు ఆయన విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సమస్యను పరిష్కారం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
పాదయాత్ర పేరిట చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధపడ్డారని బొత్స విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రధానికి రాసిన లేఖ ద్వారా చంద్రబాబు తెలంగాణపై మరింత అస్పష్టతను ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు.
వెనుకబాటుతనాన్ని గీటురాయిగా తీసుకుని రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే ఉత్తరాంధ్రను కూడా ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తాను గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014 వరకు ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదని ఆయన అన్నారు. తద్వారా రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని ఆయన చెప్పినట్లయింది. తానెప్పుడు కూడా సమైక్యాంధ్ర అని అనలేదని ఆయన అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానానికి స్పష్టత ఉందని, త్వరలోనే పరిష్కారం చూస్తుందని బొత్స అన్నారు. హిందీ మాట్లాడేవారికి ఎక్కువ రాష్ట్రాలున్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన అన్నారు. ఏ క్షణమైనా నిర్ణయం చెప్పేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు సమన్వయం పాటించాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారని విమర్సించారు.