కృష్ణానదిపై తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో కొత్త బ్యారేజ్.. ఆ ప్రాంతాలకు జలకళ!
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో కీలక చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతంలో కృష్ణా నదిపై ఒక కొత్త బ్యారేజీ నిర్మాణం కోసం ముఖ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడనుంది. ఈ అభివృద్ధి రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సహకారానికి ఉదాహరణగా నిలవనుంది.
కృష్ణా నదిపై కొత్త బ్యారేజ్
తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని కొల్పూరు గ్రామం మరియు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలోని కోర్త్కుండా గ్రామం మధ్య కృష్ణా నదిపై ఈ బ్యారేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. సుమారు 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండే ఈ బ్యారేజీపై ఒక వంతెన కూడా నిర్మించనున్నారు. దీని మొత్తం వ్యయం సుమారు రూ.500 కోట్లుగా అంచనా వేయబడింది.

ఈ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు
జూరాల జలాశయానికి కింద భాగంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా మక్తల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది.ముఖ్యంగా కృష్ణా మండల ప్రాంతంలో నీటి కొరత ఉన్న గ్రామాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందతాయి. అంతేకాకుండా, శక్తినగర్ ప్రాంతంలో ఉన్న పాత వంతెనపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఇది వాణిజ్యం, పర్యాటకం మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది.
భీమా నదిపై మరో చిన్న బ్యారేజీ ప్రతిపాదన చేసిన తెలంగాణా మంత్రి
దీనికోసం తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కర్ణాటక ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురాగా, తెలంగాణ సానుకూలంగా స్పందించింది. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి భీమా నదిపై మరో చిన్న బ్యారేజీ నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించారు. నారాయణపేట జిల్లా తంగడిగి మరియు కర్ణాటకలోని సుగూరు మధ్య 0.25 టీఎంసీల సామర్థ్యంతో ఈ బ్యారేజీని నిర్మించాలని సూచించారు. ఈ చిన్న ప్రాజెక్టు సరిహద్దు గ్రామాల రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది.
సంయుక్త కమిటీ ఏర్పాటు.. ప్రాజెక్ట్ ల సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక
రెండు రాష్ట్రాల ఇంజినీర్లతో కూడిన ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను వివరంగా అధ్యయనం చేయనున్నారు. హైడ్రాలజీ, ముంపు ప్రాంతాలు, పర్యావరణ ప్రభావం, సాంకేతిక అంశాలు వంటివి పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టులు అనుకున్నట్టు ఇఉ రాష్ట్రాలు సంయుక్తంగా చేయగలిగితే, తెలంగాణ-కర్ణాటక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది.













Click it and Unblock the Notifications