అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది ??
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం వన్నెదొడ్డి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రయాణికుల వివరాల ప్రకారం, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తోంది. వన్నెదొడ్డి వద్ద ఎదురుగా వస్తున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడని.. దీంతో బస్సు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లినట్టు వాపోతున్నారు.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న వారి అరుపులతో ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

10 మంది పరిస్థితి విషమం..
గాయపడిన వారిలో పలువురికి చేతులు, కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. తలకు తీవ్ర గాయాలైన 10 మందిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరికొందరికి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి అధిక వేగమే కారణమా?
ప్రాథమిక విచారణలో బస్సు అధిక వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి సమయం కావడం, హైవేపై భారీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అసలు ప్రమాద కారణాలపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బోల్తాపడ్డ బస్సును క్రేన్ సహాయంతో తొలగించిన అనంతరం పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
ట్రాఫిక్కు అంతరాయం
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ పరిస్థితి, వాహనం సాంకేతిక లోపాలు, డ్రైవింగ్ వేగం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రయాణికుల భద్రతపై ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవలే అనంతపురం జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డివైడర్ను ఢీకొని పలువురు గాయపడిన ఘటన కలకలం రేపింది. ఈ రోడ్డుపైనే తరచూ బస్సులు బోల్తాపడటం, వాహనాలు ఢీకొనడం వంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హైవేపై స్పీడ్ కంట్రోల్ చర్యలు కఠినతరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications