కవాతు కోసం కదిలిన పార్టీలు: జానాకు డిసిఎం మద్దతు
నాంపల్లి నుంచి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ కవాతు సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కిషన్ రెడ్డి ఖండించారు. రైళ్లను, బస్సులను ఆపి కవాతును అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, ఇచ్చిన మాటను మోసం చేస్తోందని ఆరోపించారు. అక్రమ అరెస్టులు సరికాదన్నారు.
ఎంపీల అరెస్టు శోచనీయం.. కెకె
అధికార పార్టీ ఎంపీలను ప్రభుత్వం అరెస్టు చేయించడం శోచనీయమని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన ఎంపీలను అనుమతించక పోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే స్పందించే తెలంగాణ మంత్రులు ఇప్పుడు తమను అరెస్టు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జానా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. దామోదర
తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా ప్రభుత్వం చర్యలకు పాల్పడితే మంత్రి జానా రెడ్డి చెప్పినట్లుగా తోటి మంత్రులతో చర్చించి తాము మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యార్థులు, తెలంగాణవాదులు శాంతియుతంగా ధర్నా చేయాలని సూచించారు. పోలీసులు కూడా నిర్బంధ చర్యలకు పాల్పడవద్దన్నారు.