తెలంగాణను మేమే అడ్డుకుంటున్నాం: టిజి వెంకటేష్

ఒక్క కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ తెలంగాణ ఇచ్చేయొచ్చని ప్రకటించాయని, ఎన్నికల ప్రణాళికల్లో కూడా పేర్కొన్నాయని చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా వంద శాతం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అయితే, తమ సమస్యలు తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా, రాయలసీమల్లోని నాయకులు మాత్రమే తెలంగాణను అడ్డుకుంటున్నట్లు చెప్పారు. అభివృద్ధి మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతమైన నేపథ్యంలో, తెలుగు మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని పెద్దలు త్యాగాలు చేసి రాజధానులు మార్చారన్నదీ గుర్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ వంటి సమస్యలు ఎన్నికలకు ముందు మాత్రమే పరిష్కారం కాగలవని అభిప్రాయపడ్డారు. అంతే తప్ప ముందుగానే పరిష్కరించి ఎవరూ కుంపటి పెట్టుకోరని విశ్లేషించారు. తెలంగాణ ఇస్తారంటే సీమాంధ్రలో, ఇవ్వబోమంటే తెలంగాణలో భగ్గుమంటుంది కాబట్టే జాప్యం తప్పదన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఏదో ఒక నిర్ణయం వెలువడుతుంది తప్ప అంతవరకూ ఏమీ జరగదని స్పష్టం చేశారు. ఇప్పుడే చెప్పి రాష్ట్రాన్ని తగలబెట్టాలని ఎవరూ అనుకోరని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో సమస్యలే లేకుండా చేశారని, కాబట్టే కెసిఆర్ చెప్పేందుకు ఏమీ లేకుండా పోయాయని అన్నారు. అందుకే ఆయన దేనికైనా సిద్ధపడుతున్నారన్నారు. తెలంగాణ కలగానే మిగిలిపోతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రజల అజెండా అని, అది సాధ్యం కాకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణపై ప్రస్తుతం అధిష్ఠానం నిర్ణయం తీసుకునే పరిస్థితి లేనందువల్ల పెద్దలను కలిసే అవకాశం లేదన్నారు. నిర్ణయం ఏదైనా ఉండేట్లయితే అప్పుడు చూస్తామని, ఈ లోగా సీమకు ప్రత్యేక నిధి కోసం వారిని కలుస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications