ఉద్యోగి భార్య ఆత్మహత్య: చిక్కుల్లో విజయ్ మాల్యా
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఇంజనీరుగా పని చేస్తున్న ఉద్యోగి భార్య సుష్మిత(45) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సుస్మితా చక్రవర్తిగా గుర్తించారు. ఆమె భర్త మనస్ చక్రవర్తి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఇంజనీరుగా పనిచేస్తన్నాడు. పలం ప్రాంతంలో మంగళపురి కాలనీలోని డిడిఎ ఫ్లాట్లో వారు నివాసం ఉంటున్నారు.
మృతురాలు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తన భర్తకు గత ఆరు నెలలుగా వేతనం రావడం లేదని, తాము తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని ఆమె ఆ నోట్లో రాసింది. తన భర్త, కుమారుడు తనను ఎంతో బాగా చూసుకుంటున్నారని, వారిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని కూడా ఆమె అందులో రాసింది.
ఈ సంఘటన గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. తలుపు తట్టినా ఫలితం లేకుపోవడంతో వెళ్లి చూడగా ఆమె దుపట్టాతో ఉరేసుకుని సీలింగ్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఆమెకు భర్త, 18 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుమారుడు అస్సాంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.