ఎవరికి ఎవరు గురువో: జగన్, రాబర్ట్ వాద్రాపై టిడిపి
ఈ కేటాయింపు వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ మూసాపేట వద్ద రూ.500 కోట్ల విలువైన 23 ఎకరాల స్థలాన్ని అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి సర్కారు 2007లో డిఎల్ఎఫ్కు కేటాయించిందని, ఇంత ఖరీదైన స్థలానికి ఏడాదికి రూ.3.5 కోట్లు లీజుగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, రైతుల సేవ పేరుతో ఇచ్చి అందులో వ్యాపార వాణిజ్య భవనాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
వాద్రా ఆదేశం, కెవిపి రామచంద్ర రావు మధ్యవర్తిత్వంతో ఈ కేటాయింపు జరిగిందని విమర్శించారు. డిఎల్ఎఫ్ సంస్థ తానే అప్పుల్లో కూరుకుపోయి ఆ రుణాలకు 15 శాతం వడ్డీ చెల్లిస్తోందని, తన దగ్గర ఆస్తులు కొనుక్కోవడానికి ఆ సంస్థ వాద్రాకు వడ్డీలేని రుణం రూ.65 కోట్లు ఇచ్చిందంటే నమ్మశక్యమేనా అని ప్రశ్నించారు. ముడుపుల సొమ్మును ఇలా రుణం పేరుతో డిఎల్ఎఫ్ నుంచి వాద్రా తీసుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో ఉన్న హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ విలువైన భూములను డిఎల్ఎఫ్ సంస్థకు వాద్రా కారుచౌకగా ఇప్పించారని ఆరోపించారు. తన సామంతరాజే (దివంగత వైయస్) రూ.లక్ష కోట్లు సంపాదిస్తే తాను ఎంత వెనకేసుకోవాలని సోనియా అనుకున్నట్లున్నారన్నారు. అందుకే ఆమెకు తెలిసే వాద్రా ఈ వ్యవహారాలు నడిపారని ఆరోపించారు. చూడబోతే సోనియా, జగన్ల మధ్య వాటాల పంపిణీలోనే తేడా వచ్చినట్లు కనిపిస్తోందన్నారు.