కిరణ్పై మళ్లీ శంకరన్న, సిఎం నిస్సహాయుడు: జానా
తెలంగాణ ప్రాంత నేతల మధ్య కిరణ్ కుమార్ చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి డికె అరుణ ఢిల్లీ పర్యటన వెనుక ముఖ్యమంత్రి హస్తముందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గ్రూపులను ప్రోత్సహించడం ముఖ్యమంత్రికి సరికాదన్నారు. ముఖ్యమంత్రికి హఠావో కాంగ్రెసు బచావో అంటూ త్వరలో అధిష్టానాన్ని కోరనున్నట్లు చెప్పారు. త్వరలో ఆయన పీఠం నుండి తప్పుకోవాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. అప్పుడే రాష్ట్రానికి, పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు.
ముఖ్యమంత్రి నిస్సహాయుడు.. జానా
తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిస్సహాయుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. రాజకీయాల కోసం కంటే ప్రజల అభీష్ట మేరకు తెలంగాణను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పేరిట కొందరు ఢిల్లీకి వెళ్లి టైంపాస్ చేస్తున్నారని డికె అరుణ అండ్ కోను ఉద్దేశించి అన్నారు. మీడియాకు ఎక్కడం కోసమే వారు ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆరోపించారు.
తెలంగాణ నేతలు 119 స్థానాలపై కాంగ్రెసు పార్టీకి హామీ ఇస్తే కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాజకీయం కోసం విభజన అని అనడం సరికాదన్నారు. మీడియా, తెలంగాణవాదుల ఒత్తిడితోనే ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారని అన్నారు. జానా రెడ్డి వరంగల్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు.