గైర్హాజరీకి జగన్, అతనికే బాగా తెలుసు: సిబిఐ కౌంటర్
వాన్పిక్ కేసులో జగతి పబ్లికేషన్స్ తరఫున వైయస్ రాఘవేంద్ర రావు, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున బి రమేష్ బాబు, భారతీ సిమెంట్స్ లిమిటెడ్ తరఫున గోవిందప్ప బాలాజీ, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధిగా వేణుగోపాల్ రాజు కోర్టు విచారణకు హాజరవుతారని, అందుకు అనుమతించాలని డిఫెన్స్ న్యాయవాది అశోక్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో నాలుగు పిటిషన్లు వేశారు.
ఆయా కంపెనీలపై సిబిఐ అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో ఆయా కంపెనీల తరఫున జగనే కోర్టుకు రావడం ఇబ్బందని, ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వీటిపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్లు దాఖలు చేసింది. జగతి తరఫున వైయస్ రాఘవేంద్ర రావు హాజరవుతారని డిఫెన్స్ కోరిందని, అయితే ఆయన జగతిలో షేర్హోల్డర్ కాదని, అలాగే మేనేజ్మెంట్ వ్యవహారాల్లోనూ పాలుపంచుకోవడం లేదని, డైరెక్టర్గా విధులు నిర్వర్తించడం లేదని, ఈ నేపథ్యంలో ఆయనను ఎలా జగన్ ప్రతినిధిగా ఆమోదించాలని ప్రశ్నించింది.
జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కీలావన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ సహా పలు కంపెనీల్లోకి భారీగా నిధులొచ్చాయని పేర్కొంది. మే 2004-ఆగస్టు 2009 మధ్య దివంగత వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెట్టుబడుల రూపంలో లంచాలు స్వీకరించారని ఆయా చార్జ్జిషీట్లలో పేర్కొన్నామని తెలిపింది.
ఏ కంపెనీ నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, దాని నేపథ్యం ఏంటో జగన్కే బాగా తెలుసునని, ఇంత పెద్ద కేసులో ఇతరులు ఆయన ప్రతినిధులుగా వస్తే సరైన వివరాలు కోర్టు ముందుకు రాలేవన్నారు. వైయస్ సర్కారు ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు తప్ప ఇతర కంపెనీలేవీ జగతిలో అధిక ప్రీమియంతో షేర్లు కొనలేదని, దీంతో క్విడ్ ప్రోకో జరిగినట్లు తెలుస్తోందని తెలిపింది. రఘురాం సిమెంట్స్లో ఆ కంపెనీకి నిధులు వచ్చిన సమయం(2007-09)లోగోవిందప్ప డైరెక్టర్ కాదని, ఆ తర్వాతే డైరెక్టరయ్యారని సిబిఐ తెలిపింది. అలాగే సిలికాన్ బిల్డర్స్, కార్మెల్ ఏషియాలోనూ అంతేనని తెలిపింది.