పార్థసారథికి రిలీఫ్: ఈడి అప్పిలేట్ తీర్పుపై హైకోర్టు స్టే
ఈ తీర్పుపై పార్థసారథి హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటీషన్పై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఫెరా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో తనకు శిక్ష విధిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ సెషన్స్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎక్సైజ్ అండ్ సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో మంత్రి తరపున సీనియర్ న్యాయవాది పద్మనాభ రెడ్డి వాదించారు. మంత్రికి చెందిన కెపిఆర్ ప్లాస్టిక్స్(ప్రస్తుతం ఈ సంస్థ కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ లిమిటెడ్) ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 1994లో ఆయనపై కేసు నమోదు చేశారని తెలిపారు. అప్పట్లో ఆ సంస్థ విదేశీ మెషినరీ కోసం రూ.69 లక్షలు చెల్లించిందని, మిగిలిన మొత్తాన్ని చెల్లించలేక దానిని దిగుమతి చేసుకోలేక పోయిందని, దీంతో ఈ డీల్ మధ్యలోనే నిలిచిపోయిందని వివరించారు.
ఇందులో ఎటువంటి అవినీతి, దురుద్దేశాలు లేవని తెలిపారు. వాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక నేరాల కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలకు ఈడి న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కోర్టు తీర్పు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెస్తుందనే కారణంతో కొట్టివేయాలనడం సరికాదని వాదించారు.