చంచల్గుడా జైల్లో వైయస్ జగన్ రిలాక్స్, దినచర్య
ఆ టీవీ చానెల్ వార్తాకథనం ప్రకారం - వైయస్ జగన్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కుని టీ గానీ కాఫీ గానీ సేవిస్తున్నారు. ఆ తర్వాత దినపత్రికలు చదువుతున్నారు. ఆ తర్వాత స్నానం ముగించి టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత తన గదిలోంచి బయటకు వస్తారట.
గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇతర విఐపి ఖైదీలతో ముచ్చట్లు పెడుతారు. బెయిల్ డీల్ స్కామ్ కేసులో తిరిగి చంచల్గుడా జైలుకు వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. సాధారణంగా క్యారమ్స్ గానీ చెస్ గానీ ఆడుతుంటారట. ఆయనతో పాటు బిపి ఆచార్య, గాలి జనార్దన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ వంటివారు ఆటల్లో పాల్గొంటారు.
కాసేపు షటిల్ కూడా ఆడుతారట. మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకుని మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వచ్చిన తన తోటి విఐపి ఖైదీలతో షటిల్ ఆడుతారు. తన ముఖ్య అనుచరుడు సునీల్ రెడ్డి ఆయనతో షటిల్ ఆడుతారని చెబుతున్నారు. ఆరు గంటల దాకా అలా ఆటలతో కాలం వెల్లబుచ్చుతారు.
విఐపి ఖైదీలకు వండిపెట్టడానికి ఇద్దరు వంట మనుషులున్నారు. వారితో విఐపి ఖైదీలు తమకు ఇష్టమైన వంటకాలు చేయించుకుంటారట. రాత్రి 9 గంటలకు భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత జగన్ ఏదైనా పుస్తకం తీసుకుని చదువుతారట. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఆయన నిద్రకు ఉపక్రమిస్తారని టీవీ చానెల్ కథనం చెప్పిన విషయం.