వైయస్ విజయమ్మతో మాజీ ఎమ్మెల్యే భేటీ: 11న తీర్థం
తాను సూర్యాపేటలో వచ్చే నెల 11న లేదా 15న వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని గతంలో చెప్పారు. దీనిపై చర్చించేందుకు సంకినేని ఈ రోజు ఆమెను కలిసినట్లుగా తెలుస్తోంది. కాగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వర రావు జైల్లో ఉన్న జగన్ను సోమవారం మధ్యాహ్నం ములాఖత్ సమయంలో కలిశారు. నల్గొండ జిల్లాలో సంకినేని వెంకటేశ్వర రావుకు మంచి పట్టు ఉంది.
ఆయన తెలుగుదేశం పార్టీలో జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి సంకినేని పార్టీ వీడటం జిల్లాలో టిడిపికి గట్టి దెబ్బే అంటున్నారు. జైలులో జగన్ను కలిసిన అనంతరం సంకినేని చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. హీరో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టి బాబుకు మద్దతిస్తున్నారని, అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాలయ్య బాబు ఇప్పటి వరకు బయటకు రాకుండా జైలులోనే ఉండేవాడని ఆరోపించారు.
చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కలిసిపోయారని, వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలన అందించాలనే సదుద్దేశ్యంతో పార్టీని స్థాపించారన్నారు. జగన్ను ఎదుర్కోలేని చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అతన్ని జైలులోనే ఉంచాలని కుటిల యత్నాలు చేస్తున్నారన్నారు.