ఆంధ్ర నేతల మాటలే వింటోంది: అధిష్టానంపై విహెచ్
అయితే, తాను మంత్రి పదవి ఆశించలేదని ఆయన అన్నారు. తనకు 2008లోనే అన్యాయం జరిగిందని అన్నారు. అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులకు అధిష్టానం న్యాయం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బడుగు, బలహీనవర్గాలకు విస్తరణలో ప్రాధాన్యం ఇచ్చారని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టానం ఇష్టమని విహెచ్ అన్నారు.
కాంగ్రెసుకు నీతినియమాలున్నాయని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడినవారిని కాంగ్రెసు సహించలేదని అన్నారు. 2జి కుంభకోణంలో యుపిఎ భాగస్వామ పక్షమైన డిఎంకెకు చెందిన రాజాను, కనిమొళిని కూడా జైలుకు పంపించిందని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 2004 నుంచి జరిగిన భూకేటాయింపులపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను రేపు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, కోర్టులు ఆదేశిస్తేనే విచారణ జరగాలనేది సరి కాదని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని తన బంధువులకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.. కాంగ్రెసు పార్టీని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని వైయస్సార్ కాంగ్రెసుకు చెందిన షర్మిల, వైయస్ విజయమ్మ విమర్శిస్తూ ఉంటే చూస్తు ఊరుకోవడం సరి కాదని ఆయన అన్నారు. సహిస్తూ ఊరుకుంటే వారు చెప్పే మాటల్లో నిజం ఉందని ప్రజలు అనుకుంటారని అన్నారు.
జగన్ జైల్లో ఉన్నాడు, షర్మిల రోడ్డు మీద ఉన్నారు, విజయమ్మ బైబిల్ చేతిలో పట్టుకుని మాట్లాడుతారని విహెచ్ వ్యంగ్యంగా అన్నారు. బైబిల్ను ధైర్యం కోసం పట్టుకుంటున్నానని విజయమ్మ చెబుతున్నారని, రాజకీయాలకు బైబిల్ను వాడుకోవద్దని క్రైస్తవ సోదరులు చెప్పడం అభినందనీయమని అన్నారు.
ఇదిలావుంటే, లేపాక్షి నాలెడ్జ్ సిటీ భూకేటాయింపులను ర్దదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేపాక్షి నాలెడ్జి సిటీకి ఇచ్చిన 8,848 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎపిఐఐసిని ఆదేశించారు. అనంతపురం జిల్లా గోరంట్ల, చినమత్తూరు మండలాల్లో లేపాక్షి నాలెడ్జీ సిటికీ భూములు కేటాయించారు.