Southwest Monsoon: చల్లని కబురు- రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్..!
ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ముందుగానే రాబోతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల వడగాల్పులకు తోడు అకాల వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు నేరుగా రుతుపవనాలే వచ్చేస్తున్నాయి. దేశానికి జీవనాధారమైన రుతుపవనాల కోసం ఈ సంవత్సరం వేచి ఉండాల్సిన సమయం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని వాతావరణ విభాగం వెల్లడించింది.
ప్రతీ ఏటా నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రవేశించాల్సి ఉంది. కానీ ఈసారి మాత్రం దాదాపు ఆరు రోజుల ముందుగానే అంటే మే 26న అవి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇవాళ అంచనా విడుదల చేసింది. ఈ అంచనాలో నాలుగు రోజుల అటూ ఇటూ ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. అంటే రుతుపవనాలు మే 22 నుండి మే 30 మధ్య ఎప్పుడైనా రావచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాలు తీవ్రమైన వడగాలులతో అల్లాడుతున్నాయి.రాజస్థాన్లోని బార్మర్లో మే 11న 47.3°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల హెచ్చరికలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేరళలో రుతుపవనాల రాకతో, తీవ్రమైన వేసవికి ముందు కాలం అధికారికంగా ముగిసిపోతుంది. అలాగే ఉపఖండం అంతటా వర్షాలు క్రమంగా ఉత్తరం వైపు సాగడానికి ఇది సంకేతం. ఈ పరిణామం సాధారణంగా జూలై మధ్య నాటికి భారతదేశం మొత్తానికి విస్తరిస్తుంది.














Click it and Unblock the Notifications