గోదానం: 500 కిమీ మైలురాయి దాటిన చంద్రబాబు
వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన మంగళవారం మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని ఆయన విమర్శించారు. ఇది పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.
తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే పెడతానని ఆయన హామీ ఇచ్చారు. వర్షాకాలంలోనే రోజుకు మూడు గంటలు విద్యుత్ ఇస్తే ఇక వచ్చేది వేసవి కాలం ఇక కరెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే ఊహించాలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హాయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తొమ్మిది గంటలపాటు విద్యుత్ ఇచ్చామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు.
చంద్రబాబు పాదయాత్ర మంగళవారం 500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఆత్మకూరు గ్రామంలో ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 192 గ్రామాల్లో పర్యటించారు. మహబూబ్నగర్ జిల్లాలోకి చేరుకున్న తర్వాత 9 రోజుల్లో ఆయన 111 కిలోమీటర్లు నడిచారు.