వస్తున్నా మీకోసం: చంద్రబాబు యాత్రకు 'బ్రేక్స్'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రకు మహబూబ్ నగర్లో అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నాయి. చంద్రబాబు తన పాదయాత్రను అక్టోబర్ 2వ తేదిన అనంతపురం జిల్లా హిందూపురం నుండి ప్రారంభించారు. అనంత, కర్నూలు జిల్లాల్లో సాఫీగా సాగిన చంద్రబాబు పాదయాత్ర పాలమూరుకు వచ్చే వరకు మాత్రం ఒడిదుడుకులతో సాగుతోంది!
మొన్నటి తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి అడ్డంకుల నుండి నిన్నటి నీలం తుఫాను వరకు బాబు యాత్ర బ్రేకులతో సాగింది. దీంతో మొదట అనుకున్నట్లుగా ఈ నెల 4వ తేదిన లేదా ఆరో తేదిన పాలమూరు జిల్లాలో పాదయాత్ర ముగిద్దామనుకున్న చంద్రబాబుకు 8వ తేది వరకు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా నుండి పాలమూరు జిల్లాలోకి ప్రవేశించే సమయంలో తాము బాబును అడ్డుకుంటామని జెఏసి హెచ్చరించింది.
దీంతో తెలుగు తమ్ముళ్లు అప్రమత్తమయ్యారు. అయితే జెఏసి బాబును అడ్డుకోవడంలో విఫలమైంది. దీంతో టిడిపి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ తర్వాత మూడు, నాలుగు సార్లు బాబు యాత్రకు వివిధ కారణాలతో బ్రేకులు పడింది. గద్వాల్లో వేదిక పైకి ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు ఎక్కడం, బాబుతో కరచాలనం చేసేందుకు పోటీ పడటంతో అది కూలింది. ఈ ఘటనలో బాబు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఒకరోజు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అకాల మృతితో మరో రెండు రోజులు ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా వచ్చిన నీలం ప్రభావంతో రాష్ట్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అయింది. శ్రీకాకుళం, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో ఆయన తప్పని పరిస్థితుల్లో మరో రోజు తన పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాఫీగా సాగినప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మూడుసార్లు వాయిదా పడింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోకి ఆలస్యంగా ఈ నెల 8వ తేదిన బాబు పాదయాత్ర ఎంటర్ కానుంది.
మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో చంద్రబాబు పాదయాత్రలో వేదిక కూలి ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ చంద్రబాబు ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని యాత్రను పునఃప్రారంభించారు.
పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అకాల మృతి కారణంగా చంద్రబాబు పాదయాత్ర రెండు రోజులు వాయిదా పడింది.
నీలం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. దీంతో చంద్రబాబు మరోసారి తప్పని పరిస్థితుల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, బాధితులను ఓదార్చేందుకు తన పాదయాత్రను ఓ రోజు వాయిదా వేసుకున్నారు.
కేవలం పాలమూరు జిల్లాలోనే మూడుసార్లు బ్రేకులు రావడంతో చంద్రబాబు పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ఆలస్యంగా ప్రవేశించనుంది. ఈ నెల 8న చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తుంది. పరిగి, చేవెళ్ల తదితర మండలాల్లో ఆయన పర్యటిస్తారు.
దీంతో చంద్రబాబు పాదయాత్ర అనుకున్న సమయానికంటే ఆలస్యంగా రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే బాబు యాత్ర పరిగి, చేవెళ్ల తదితర మండలాల్లో ఉంటుంది. వరుసగా వస్తున్న పలు బ్రేకులు, ఇతర కారణాల వల్ల చంద్రబాబు పాదయాత్ర కుదించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. వచ్చే నెల జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం రోజు పాదయాత్ర ముగించాలని బాబు నిర్ణయించుకున్నారు.
ఇలా వరుస బ్రేకులు వస్తే అనుకున్నంత దూరం చంద్రబాబు పాదయాత్ర చేసే అవకాశాలు లేవు. అయితే చంద్రబాబు పాదయాత్ర రోజుకు ఇరవై కిలోమీటర్ల నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఉంటే ముందుగా అనుకున్న అన్ని జిల్లాలు చుట్టేయవచ్చునని చెబుతున్నారు. అలా కాకుండా పాదయాత్రను ముందుగా అనుకున్న అన్ని జిల్లాల్లో చేయలేక పోయినప్పటికీ జనవరి 26న ముగించి రెండో విడతగా మరోసారి చేయాలని భావిస్తున్నారు.