తెలంగాణ ఎంపిలు: తెరాస, జగన్ పార్టీల్లోకి జంప్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రకటించక పోతే ఇతర పార్టీల్లోకి దూకడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రులుగా ఉన్న ఎస్ జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, సికింద్రబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ మినహా మిగతా తెలంగాణ లోకసభ సభ్యులంతా ఇతర పార్టీల్లోకి దూకడానికి స్కెచ్ గీసుకున్నట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లోకి వారు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెసు తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే, జైపాల్ రెడ్డి కూడా కాంగ్రెసు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం గానీ, కొత్త పార్టీని స్థాపించడం గానీ చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నట్లు చెబపుతున్నారు.
కాగా, మిగతా తెలంగాణ లోకసభ సభ్యులంతా కొంత మంది వైయస్సార్ కాంగ్రెసులోనూ మరికొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ చేరుతారని అంటున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపిలు ఎవరికి ఇష్టమైన పార్టీలోకి వారు వెళ్లిపోతారని ఇటీవల సుఖేందర్ రెడ్డి అన్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన రాజయ్య, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వివేక్, మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం తెరాసలోకి చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మాత్రం ఎటు వెళ్తారనేది తేలడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఆయన మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు లేవని అంటున్నారు. సురేష్ షేట్కర్ కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తనతో పాటు ఐదుగురు పార్లమెంటు సభ్యులు తెరాసలోకి వస్తారని కేశవరావు కెసిఆర్కు చెప్పినట్లు సమాచారం. కేశవరావు మొదటి నుంచి తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది.
తెలంగాణ నిర్ణయం ప్రకటించిన వెంటనే వలసలు ఉంటాయనే ఆందోళనతోనే కాంగ్రెసు అధిష్టానం జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువరిస్తే మెజారిటీ లోకసభ సభ్యులు ఇతర పార్టీలకు చేరే అవకాశాలున్నాయని గుర్తించే నిర్ణయాన్ని వెలువరించడం లేదని అంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, మెజారిటీ పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్ పార్టీలోకి దూకే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణపై ఎటూ తేల్చకుండా అధిష్టానం నానుస్తోంది. అయితే, తెలంగాణ పార్లమెంటు సభ్యులు మాత్రం అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక రకంగా కాంగ్రెసు అధిష్టానం మెడపై తెలంగాణ కత్తి వేలాడుతోంది.












Click it and Unblock the Notifications