ఒక్కదెబ్బకి టిడిపి, బిజెపి: ఎన్నికల్లో 'ఢీ'కి కెసిఆర్ ప్లాన్
ఈ రోజు కరీంనగర్ జిల్లాలో జరిగిన మేధోమథనంలో కెసిఆర్ పార్టీ నేతలకు సిపిఐతో పొత్తు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణవాదాన్ని పలు పార్టీలు వినిపిస్తున్న నేపథ్యంలో తెరాస కొద్దిగా బలహీనపడింది. గత రెండేళ్లుగా ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు. అదే సమయంలో కెసిఆర్ నిత్యం అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అని చెప్పడం కూడా ఆ పార్టీ కొంప ముంచింది. కెసిఆర్ చెప్పే మాటలు నమ్మని స్థితికి తెలంగాణ ప్రజలు వచ్చారు.
దీంతో తెరాస మరోసారి ప్రధానంగా ఉండేందుకు ప్రత్యామ్నాయం కోసం వెతికిన కెసిఆర్కు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సిపిఐ కనిపించినట్లుగా ఉంది. సిపిఐ చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపి పార్టీకి మద్దతుగా మొదటి నుండి నిలుస్తోంది. అయితే ఒక్క తెలంగాణ విషయంలో విభేదిస్తోంది. అందుకే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలో టిడిపికి మద్దతిచ్చిన సిపిఐ తెలంగాణలో మాత్రం తెరాసకు మద్దతు పలికింది.
అయితే తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు ప్రకటించిన తర్వాత సిపిఐ నారాయణ వైఖరి టిడిపికి మరింత దగ్గరగా వెళ్తున్ట్లుగా కనిపించింది. ఇలాంటి సమయంలో కెసిఆర్ తెలంగాణలో టిడిపిని దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగానే సిపిఐతో పొత్తు తెరపైకి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపి హవాకు కూడా చెక్ చెప్పేందుకు సిపిఐతో పొత్తు ఉపయోగపడుతుందని కెసిఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన మేధోమథనంలో సిపిఐ పొత్తు అంశాన్ని ప్రస్తావించారని, అయితే సిపిఐ ఏ మేరకు స్పందిస్తుందో చూడాలంటున్నారు.