ఆటోలో నోట్లపై తికమక: ఎమ్మెల్యేదా, బిజినెస్మెన్దా?
ఆటోలో దొరికిన ఆరున్నర కోట్ల రూపాయలు తనవేనని ఆయన పోలీసులకు తెలిపారు. పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి పేరు రామారావు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. తాను చంపాపేట యాక్సిస్ బ్యాంక్ నుండి రూ.2 కోట్లు తీసుకున్నానని, అవన్నీ రూ.500 నోట్లని, అలాగే కర్నాటక నుండి ఆరున్నర కోట్ల రూపాయలు, వెయ్యికోట్ల కట్టలు వచ్చినట్లు తెలిపారు. ఆ డబ్బు తనదే అని అతను ముందుకు రావడంతో పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు.
అదుపులో ఉన్న వ్యక్తి డబ్పు ప్రజాప్రతినిధివి అని చెబుతుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారి తనవి అని చెబుతుండటంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదట. కాగా డిజిపి కార్యాలయం వద్ద పట్టుబడిన డబ్బులు ఎవరివో తెలుసుకోవడం సులభమేనని, కష్టమేమీ కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
దొరికిన డబ్బు అంతా కొత్త నోట్లేనని తెలుస్తోంది. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుండి డ్రా చేశారు. సీరియల్ నెంబర్ల ఆధారంగా డబ్బు ఎవరిదో తెలుసుకోవచ్చునని చెబుతున్నారు. ఇవి రాజకీయ నాయకుడివా లేక పోలీసులను ఆశ్రయించిన వ్యాపారివా తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆ డబ్బు నాదే
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ డబ్బు తనదేనని పోలీసుల విచారణలో తెలిపారు. తాను లాండ్ కొనేందుకే ఆ డబ్బును ఆటోలో తరలిస్తున్నట్లుగా పోలీసులకు చెప్పాడు. ఇతను బాల సాయిబాబా ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాడు. అయితే డబ్బుల్ని ఆటోలో తరలించడమే పోలీసులకు అంతు చిక్కడం లేదు. దీంతో ఆ డబ్బు నిజంగా అతనిదేనా లేక దొరికిన వ్యక్తి చెప్పినట్లుగా ప్రజాప్రతినిధిదా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.