ఎన్నికలపై ఢిల్లీ నుండి సంకేతాలు, నడవగల్గుతా: బాబు
స్థానిక సంస్థలను తక్షణమే జరిపించాలని చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్లో లేదంటే డిసెంబర్లో లోకసభ ఎన్నికలు రావొచ్చునని అన్నారు. ఢిల్లీ నుండి సంకేతాలు ఉన్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒకవేళ 2013 డిసెంబర్లో లోక్సభ ఎన్నికలు వచ్చే పక్షంలో అసెంబ్లీ ఎన్నికలను కూడా వాటికి కలుపుతారని, వివిధ పార్టీల మద్దతు కూడగట్టి ఎలాగోలా 2014 వరకూ ప్రభుత్వాన్ని నడపాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందన్నారు.
అది కుదరకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సన్నద్ధంగా ఉండాలన్నారు. లోక్సభ స్థానాలకు మంచి అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టి ఇప్పటి నుంచే ఒక ప్రణాళికతో పని చేయాలన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్చార్జ్జీలుగా ఉన్నవారిని క్రియాశీలం చేయండని సభ్యులకు సూచించారు. తన కష్టాన్ని కింది స్థాయి నేతలు ఉపయోగించుకోవడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వయసులో తాను కష్టపడి పాదయాత్ర చేస్తున్నానని, పార్టీకి ఒక ఇమేజిని తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని కానీ, కింది స్థాయి నాయకులు దానిని ఉపయోగించుకొనే ప్రయత్నం చేయడం లేదన్నారు. పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమంపై సమీక్షలో ఆయన అన్నారు. 294 నియోజకవర్గాలకుగాను కేవలం 75 నియోజకవర్గాల్లోనే జరుగుతుందన్నారుప. ఎన్నికల ముందు మే నెలలో జరిగే మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఒక ఊపు తీసుకురావాలని, దీనికోసం ఇరవై లక్షల మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న ప్రతిపాదన చర్చకు వచ్చింది.
తన వరకూ తాను పూర్తి ఫిట్గా ఉన్నానని, మొదట్లో ఉన్న కాళ్ల నొప్పులూ ఇప్పుడు లేవని, ఎన్ని రోజులైనా నడవడానికి నేను సిద్ధమని చంద్రబాబు వారితో చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న పాదయాత్ర పైనా చర్చించారు. ఆమె పాదయాత్రపై ప్రజల్లో పెద్దగా చర్చ జరగడం లేదని, ఆమె వెళ్లినచోట ప్రజలు వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప ప్రభావం చూపేదిగా లేదని కొందరు నాయకులు పేర్కొన్నారు.
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస పార్టీలు మూడూ మన పైనే దృష్టి కేంద్రీకరించాయని, ఆ మూడు ఒకే జట్టు అని, ఆ ముగ్గురికి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే వనిత నియోజకవర్గంలో బలహీనంగా ఉన్నారని, వెళ్ళిపోయినా పెద్ద నష్టం లేదని, నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, మన పార్టీలోని అంతర్గత సమస్యల వల్ల ఎవరైనా వెళ్ళే పరిస్థితి ఉంటే వారితో మీరు మాట్లాడాలని, అవసరమైతే తానూ మాట్లాడతనని చెప్పారు. పార్టీని బలంగా ఉంచుకొంటే కొంతమంది నేతలు అటూ ఇటూ వెళ్లినా నష్టం ఉండదన్నారు.