మజ్లీస్తో సంప్రదింపులు: మంత్రులతో సిఎం రివ్యూ
తాజా పరిస్థితిని సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. జరిగిన సంఘటన ఏమిటి, ఈ పరిస్థితులలో తీసుకోదగిన చర్యలేమిటి, ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి మొదలైన అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో మంత్రివర్గ సహచరులకు వివరించినట్లు సమాచారం.
డిజిపిని అడిగి అసలు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఏమి జరిగిందీ ముఖ్యమంత్రి శనివారం ఉదయమే తెలుసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్నే ఆయన మంత్రులకు వివరించారు. ఈ సమావేశానికి రఘువీరా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, విశ్వరూప్, టిజి వెంకటేశ్, వట్టి వసంతకుమార్, కాసు వెంకటకృష్ణా రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, మహీధర రెడ్డి, సారయ్య, ఆనం రామనారాయణ రెడ్డి, కె. జానారెడ్డి, ప్రసాద్కుమార్, ఉత్తమ్ కుమార్ ప్రభృతులు హాజరయ్యారు.
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద జరిగిన సంఘటన చాలా చిన్నదని, ఇంత చిన్న విషయంపై మజ్లీస్ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ తెలియడంలేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సంఘటన జరిగినా సీనియర్ మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించడంలేదన్నది పెక్కుమంది ఫిర్యాదు. ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని వారు అన్నట్లు సమాచారం.