జీహెచ్ఎంసీ వాసులకు శుభవార్త.. వాట్సప్ ద్వారా మరిన్ని ముఖ్యమైన సేవలు!
హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు సంబంధించిన ఏ సేవ అయినా ఇంట్లో కూర్చునే మొబైల్ నుండే పొందే అవకాశం కల్పించింది జీహెచ్ఎంసీ. నగరవాసులకు అవసరమైన పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించే దిశగా 'మీసేవ' విభాగం సరికొత్త ముందడుగు వేసింది.
గ్రేటర్ హైదరాబాద్ లో వాట్సప్ అధునాతన సేవలకు శ్రీకారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అత్యంత కీలకమైన 9రకాల సేవలను ఇకపై వాట్సప్ , చాట్ బాట్ వేదికల ద్వారా పౌరులకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్స్ సర్వీస్ డెలివరీ సంస్థ ఈ అధునాతన సేవలకు శ్రీకారం చుట్టింది.

ముఖ్యమైన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చిన జీహెచ్ఎంసీ
మీసేవ సంస్థ గతేడాది నవంబరులోనే ఈ డిజిటల్ చాట్ బాట్ సేవలను ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన సేవలను దీనికి అనుసంధానించారు. ఇందులో ప్రధానంగా ఆస్తి పన్ను సవరణలు, జనన, మరణ ధ్రువపత్రాలలోని తప్పుల సవరణ, ఆసుపత్రుల్లో కాకుండా ఇళ్ల వద్ద జరిగే జననాలు, మరణాల నమోదు ప్రక్రియ, ఇంటి నంబర్లలో మార్పులు, చేర్పులు,ఆస్తుల బదలాయింపు లేదా మ్యుటేషన్ ప్రక్రియలు చేయనున్నారు.
మొబైల్ నుండే నిమిషాల్లో సేవలు పొందేలా ఏర్పాటు
వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ సేవలు అందించనున్నారు. ఈ సేవల వల్ల నగర ప్రజలు చిన్నపాటి పనుల కోసం కూడా మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన, గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తమ మొబైల్ నుంచే నిమిషాల వ్యవధిలో దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. ఈ సరికొత్త సదుపాయాన్ని వినియోగించుకోవడానికి నగరవాసులు మీసేవ తెలంగాణా పేరుతో వాట్సప్ నంబర్ సేవ చేసుకుని అందులో ఉన్న ఆప్షన్స్ ను అనుసరించాల్సి ఉంటుంది.
డిజిటల్ సేవలు మొబైల్ ద్వారా పొందాలంటే ఇలా చెయ్యండి
ముందుగా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ కాంటాక్ట్స్లో 80969 58096 అనే నంబరును 'మీసేవ తెలంగాణ' పేరుతో సేవ్ చేసుకోవాలి.అనంతరం తమ వాట్సప్ ఖాతా తెరిచి, సదరు నంబరుకు 'Hi' అని సందేశం పంపాలి.చాట్ బాక్స్లో మీకు కావలసిన సేవ పేరును టైప్ చేసినప్పుడు, స్క్రీన్పై ఒక మెనూ ప్రత్యక్షమవుతుంది. అందులో 'Open Service' అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. వెంటనే ఒక దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
డిజిటల్ విధానానికి ప్రజల నుండి విశేష స్పందన
దానిలో అడిగిన వివరాలను ఖచ్చితంగా భర్తీ చేయాలి. చివరగా ఆ సర్వీస్ పొందటానికి నిర్దేశించిన దరఖాస్తు రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ డిజిటల్ విధానానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, జనన ధృవపత్రాలు పొందడానికి, అలాగే ట్రాఫిక్ చలానాలు మరియు కరెంట్ బిల్లుల చెల్లింపుల కోసం అత్యధిక శాతం మంది ప్రజలు ఈ వాట్సప్ సేవలను వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications