మజ్లీస్కు షర్మిల అభినందనలు, బాబుపై దూకుడు
మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఇప్పుడు సులభమని, ఈ పరిస్థితిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సి ఉందని ఆమె అన్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు మిత్రపక్షంగా మారిపోయిందని, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ముందుకు రావడం లేదని ఆమె అన్నారు. మంగళవారం ఆమె పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగింది.
కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు కాకపోతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి నిజాయితీనీ, చిత్తుశుద్ధినీ నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసిపోయి నీచ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి అవసరమైనంత మంది శాసనసభ్యుల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కావడం వల్లనే టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆమె అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు మరిచిపోయే విధంగా కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. విచారణ పేరుతో వైయస్ జగన్ను జైలుకు పంపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్న కలలను అన్నింటినీ వైయస్ జగన్ నెరవేరుస్తారని ఆమె హామీ ఇచ్చారు. రెండు ఎకరాల నుంచి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తన స్వార్థం కోసమే కెజి బేసిన్ గ్యాస్ను చంద్రబాబు రిలయన్స్కు కట్టబెట్టారని ఆమె ఆరోపించారు.
రాజన్నకు రైతంటే చాలా ప్రేమ అని, రైతన్న ఏడుస్తుంటే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చుందని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు ప్రభుత్వం గండి కొడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలను లక్షాధికారులను చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నారని ఆమె చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆమె గుర్తు చేస్తూ అవి ఎలా అమలుకు నోచుకోవడం లేదో చెప్పారు.