మజ్లీస్ హెచ్చరికను సిఎం తేలిగ్గా తీసుకున్నారా?

మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెసు నాయకులు ఓ వైపు విజ్ఞప్తి చేస్తూనే మరో వైపు మజ్లీస్ కటీఫ్ చేసుకోవడ వల్ల నష్టమేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మజ్లీస్ విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెసు నాయకులు విఫలమయ్యారని అంటున్నారు. చివరికి బుధవారం సాయంత్రం మైనారిటీ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీతో కలిసి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మజ్లీస్ వ్యవహారంపై మాట్లాడారు.
జాతీయ దృక్పథం గల అసదుద్దీన్ ఓవైసీ చిన్న విషయంపై మద్దతు ఉపసంహరించుకోవడం సరి కాదని అంటూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో తాము హైకోర్టు తీర్పునే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మజ్లీస్ తమతో తెగదెంపులు చేసుకోవడం వెనక వేరే రాజకీయ ఎజెండా ఉందని, అంత మాత్రాన కాంగ్రెసును మతవాద పార్టీగా అభివర్ణించడం సరి కాదని ఆయన అన్నారు.
మజ్లీస్ తెగదెంపుల వల్ల తమకు ఏ విధమైన నష్టం లేదని షబ్బీర్ అలీ అన్నారు. మజ్లీస్ను బహిరంగంగా ఎదుర్కునే విషయంలో ఒక్కటిగా వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెసు నాయకులు కనిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తీరు పట్ల చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి నాయకులు ముఖ్యమంత్రి తీరును తప్పు పడుతున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం అంశాన్ని ముఖ్యమంత్రి స్థానిక పరిష్కారం కోసం ప్రయత్నించి ఉండాల్సిందని అంటున్నారు. దాన్ని ముఖ్యమంత్రి శాంతిభద్రతల సమస్యగానే చూడడం సరి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
పాతబస్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులను సంప్రదించకుండా డిజిపి దినేష్ రెడ్డి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వడం కూడా చాలా మందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి తీరుపై పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఢిల్లీకి వెళ్లిన బొత్స సత్యనారాయణ ప్రస్తుత స్థితిపై అధిష్టానానికి నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications