కెసిఆర్ ఆహ్వానం, ఒత్తిడి: టిఆర్ఎస్లోకి స్వామిగౌడ్
అయితే అప్పటికప్పుడు స్పందించని స్వామి గౌడ్ ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరడం లేదని, తెలంగాణ కోసమే పోరాటం చేస్తానని ప్రకటించారు. వివిధ సందర్భాల్లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు స్వామి గౌడ్ను చేర్చుకునేందుకు తెరాస,బిజెపిలు ప్రయత్నించాయి. అయితే తెరాసలో చేరేందుకే మొగ్గుచూపిన స్వామి గౌడ్.. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా గురువారం నిర్వహించిన సభలోనూ స్వామి గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం జరుగనున్న సమావేశానికి తెలంగాణ ఐకాస ముఖ్యులను అదే వేదికపై నుంచి కెసిఆర్ ఆహ్వానించారు. వారిలో ఐకాస కన్వీనర్గా ఉన్న స్వామి గౌడ్ కూడా ఉన్నారు. ఉద్యోగ జెఏసిలో కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్ను పార్టీలో చేర్చుకునేందుకు కెసిఆర్ ఆయనపై ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ ఉద్యోగ జెఏసి ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను ఐక్యం చేయడంలోను, వారిని ఉద్యమ దిశగా నడిపించడంలోను స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన తెరాసలోచేరతారని, చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరారని కూడా అప్పట్లో తీవ్ర ప్రచారం జరిగింది.