దర్శన్ కోసం శివాజీ పార్కుకు థాకరే భౌతిక కాయం
సంయమనం పాటించాలని, ముంబైలో ప్రశాంతతకు భంగం కలిగించకూడదని శివసేన నాయకులు తమ పార్టీ కార్యకర్తలను కోరారు. థాకరేను చివరిసారి చూడడానికి రాజకీయ పార్టీల నాయకులు, శివసైనికులు ఆయన నివాసం మాతోశ్రీకి పెద్ద యెత్తున చేరుకుంటున్నారు. దాంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రజా సందర్శన కోసం బాల్ థాకరే భౌతిక కాయాన్ని దాదర్లోని శివాజీ పార్కుకు తరలిస్తారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మూడు గంటలకు జరుగుతాయి. శివసేన తొలి ర్యాలీ శివాజీ పార్కులోనే జరిగింది. శివసేన వార్షిక దసరా ర్యాలీలు కూడా ఇక్కడే జరుగుతాయి.
అనారోగ్యం కారణంగా ఈసారి దసరా ఉత్సవాలకు థాకరే హాజరు కాలేదు. మాతోశ్రీకి రావద్దని, రేపు ఉదయం ఏడు గంటల నుంచి శివాజీ పార్కులో థాకరేకు నివాళులు అర్పించాలని పార్టీ కార్యకర్తలను కోరింది.
బాల్ థాకరే మరణవార్తతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నేతలకు ఇవ్వదలిచిన విందును రద్దు చేసుకున్నారు. సుష్మా స్వరాజ్ తదితర బిజెపి నేతలు ముంబైకి తరలి వస్తున్నారు.